ఇంద్రధనుస్సు ప్రతినిధి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు సీట్ కొరకు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయటానికి అభ్యర్థిని ఎవరిని నిలబెడతారనే ఉత్కంఠకు తెరదించింది కాంగ్రెస్ అధిష్టానం!! ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఏఐసీసీ సమావేశంలో విస్తృత సంప్రదింపుల అనంతరం మెదక్ పార్లమెంట్ సీట్ నుంచి బిసి అభ్యర్థిని పోటీలో నిలపాలని నిర్ణయించారు. ఏఐసీసీ అధిష్టానం నీలం మధు అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించటంతో, నీలం మధు అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
తెలంగాణ శాసన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి పటాన్ చెరు నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ పొందడం, అనంతరం కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయుల గొడవలతో కాంగ్రెస్ టికెట్ కోల్పోయారు. వెంటనే బీఎస్పీ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి కేవలం 46,000 ఓట్లు పొంది ఓటమి పాలయ్యారు. సార్వత్రిక ఎన్నికలు వస్తున్న తరుణంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి మెదక్ పార్లమెంట్ సీట్ కొరకు కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ పొందడం అదృష్టం! విజయం వరిస్తుందో లేదో జూన్ 4 వ తేదీన తెలుస్తుంది.