భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. అమీన్పూర్ మున్సిపాలిటీ తరఫున అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తెలిపారు.
ప్రధానంగా వరద ముంపు ప్రభావిత ప్రాంతాలలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు.
ఆయా కాలనీల సంక్షేమ సంఘం సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ జాగ్రత్తలు సూచించడం జరిగిందని తెలిపారు.
ప్రధానంగా వరద కాలువలు, డ్రైనేజీల సమీపంలో ఉన్న కాలనీలలో ఇళ్లలోకి నీరు చేరకుండా మున్సిపాలిటీ సిబ్బందితో చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అపార్ట్మెంట్ల సెల్లార్లలో నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వం ఇప్పటికే సెలవులు ప్రకటించిందని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా సమయంలో బయటకు రాకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలలో మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, వివిధ శాఖల అధికారులతో కలిసి చైర్మన్ పాండురంగా రెడ్డి పర్యటించారు.